బీజేపీ (BJP ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) సొంత పార్టీ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తెలంగాణలో హాట్టాపిక్గా మారాయి. కేంద్రమంత్రి బండి సంజయ్ పీఆర్ సోషల్ మీడియాలో (Social Media) పెట్టిన కొన్ని పోస్టులపై (Posts) ఈటల అసహనం వ్యక్తం చేశారు. తాను కూడా ఆ పోస్టులను చూశానని, అవి అవగాహన లేకుండా, బాధ్యత లేని వ్యక్తులు పెట్టే రకమైనవిగా ఉన్నాయని తీవ్రంగా వ్యాఖ్యానించారు. హన్మకొండ జిల్లా కమలాపుర్లో మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“నేను బీజేపీ ఎంపీని. ఈటల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలే నిర్ణయిస్తారు” అంటూ ఆయన స్పష్టం చేశారు. తన రాజకీయ స్థితిగతులపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై పార్టీనే తగిన నిర్ణయం తీసుకుంటుందని, దీనిపై కాలమే తేల్చుతుందని వ్యాఖ్యానించారు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చెబుతున్నారు అన్నది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు.
తనపై జరుగుతున్న ప్రచారం, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై తగిన సందర్భం వచ్చినప్పుడు అన్నీ వివరంగా మాట్లాడతానని ఈటల తెలిపారు. ప్రస్తుతం అన్నింటికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని, సమయం వచ్చినప్పుడు వాస్తవాలు బయటపెడతానని అన్నారు. రెండో, మూడో విడత ఎన్నికలు పూర్తైన తర్వాత జరిగిన అన్ని పరిణామాలను పార్టీ అధిష్ఠానానికి వివరంగా తెలియజేస్తానని ఈటల రాజేందర్ వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.








