ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరోసారి భూప్రకంపనలు (Earthquakes) ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మంగళవారం ప్రకాశం జిల్లా (Prakasam District)లోని పలుచోట్ల భూమి స్వల్పంగా కంపించినట్టు స్థానికులు తెలిపారు. పొదిలి, దర్శి, కురిచేడు, ముండ్లమూరు మండలాల్లో సెకన్ల కొద్దీ భూమి కంపించినట్లు సమాచారం. అయితే, ఈ సమయంలో పెద్ద శబ్దాలు వినిపించాయని స్థానికులు పేర్కొన్నారు. పెద్ద శబ్దాలతో భూమి కంపించటంతో ప్రజలు భయంతో తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
సోమవారం, తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ పరిణామంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోని వస్తువులు కదలడం, భూమి కొద్ది సెకన్ల పాటు కంపించడం వల్ల ప్రజలు ఏమి జరుగుతుందో తెలియక భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేసినట్టు సమాచారం.
కరీంనగర్ జిల్లాలో ప్రకంపనల ప్రభావం కాస్త తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో భూమి కొన్ని క్షణాల పాటు కంపించినట్లు స్థానికులు తెలిపారు. ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఈ భూప్రకంపనలు ప్రజలను టెన్షన్లోకి నెట్టాయి, భవిష్యత్తులో మరిన్ని ప్రకంపనలు సంభవించవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.