ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో 44 బార్లకు ఈ-వేలం (E-Auction) ప్రక్రియ ప్రారంభమైంది. లైసెన్స్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, బిడ్ అమౌంట్ చెల్లించని బార్లను ఈ-వేలం ద్వారా కొత్త లైసెన్సుదారులకు కేటాయించేందుకు అబ్కారీ శాఖ (Excise Department) అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 బార్లను ఈ-వేలం మరియు ఆన్లైన్ లాటరీ (Online Lottery) విధానంలో కేటాయించనున్నారు. బార్ల లైసెన్స్ (Bar License) తీసుకోవడానికి ఆసక్తి ఉన్న వారు ఏప్రిల్ 1 నుండి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 7తో ముగుస్తుందని వివరించారు. నాన్ రిఫండబుల్ అమౌంట్ ఏప్రిల్ 8లోగా చెల్లించాలని సూచించారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నాన్ రిఫండబుల్ చార్జీలను ఆబ్కారీ శాఖ ఖరారు చేసింది. 50 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతంలో బార్ లైసెన్స్ కోసం రూ.5 లక్షలు గానూ, 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతంలో రూ.7.5 లక్షలు, 5 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతంలో బార్ లైసెన్స్ కోసం రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ప్రక్రియ ద్వారా అత్యధిక బిడ్ పెట్టిన అభ్యర్థికి ఏప్రిల్ 9న బార్ లైసెన్స్ కేటాయిస్తారు.
బార్ల జాబితా, గెజిట్ నోటిఫికేషన్, ఇతర వివరాలు http://apcpe.aptonline.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు 8074396416 నంబర్లో సంప్రదించాలని సూచించారు.