విజయవాడలో సంచలనం సృష్టించిన డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎట్టకేలకు ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధానంగా అనుమానాలు ఎదుర్కొంటున్న డాక్టర్ అమర్ను అరెస్ట్ చేశారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాలు ఈ కేసును కొత్త మలుపు తిప్పాయి.
పోలీసుల సమాచారం ప్రకారం, అనంతపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదువుతున్న సమయంలో డాక్టర్ దీపిక, డాక్టర్ అమర్ పరిచయం పెరిగి ప్రేమగా మారింది. అనంతరం ఇద్దరూ వైద్య వృత్తిలోకి వచ్చినప్పటికీ వారి సంబంధం కొనసాగింది. డాక్టర్ దీపిక ప్రస్తుతం విజయవాడలోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో డాక్టర్ అమర్ నందిగామలో ప్రభుత్వ డాక్టర్గా పని చేస్తున్నాడు.
అయితే, అమర్ మరో యువతితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడనే విషయం తెలిసిన తర్వాత దీపిక తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. గత నెల 5వ తేదీన ఆమె ప్రమాదకరమైన ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
ఆత్మహత్యకు ముందు డాక్టర్ దీపిక, అమర్తో ఫోన్లో మాట్లాడినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ అంశాలను ఆధారంగా తీసుకుని పోలీసులు అమర్పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తదుపరి దర్యాప్తులో అమర్ పాత్రపై అనుమానాలు బలపడడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అమర్కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అమర్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.








