హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యపై ఇజ్రాయెల్ ఎట్టకేలకు స్పందించింది. తామే హతమార్చామని టెల్అవీవ్ రక్షణ మంత్రి కాట్జ్ వెల్లడించారు. “హమాస్, హెజ్బొల్లా, ఇతర ఉగ్రవాద సంస్థలను మేం ఓడించాం. ఇరాన్ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేశాం. హనియే, సిన్వర్, నస్రల్లా హత్యలకు మేమే కారణం” అని ఆయన తెలిపారు.
ఇజ్రాయెల్ ప్రభుత్వం గతేడాది జరిగిన హమాస్ దాడులకు ప్రతీకారంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. హమాస్ దాడుల వల్ల 1,200 మంది ఇజ్రాయెలీ పౌరులు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది కిడ్నాప్ చేయబడ్డారు. ఇజ్రాయెల్ చర్యలు ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లోనే కాకుండా, మధ్యప్రాచ్య దేశాల్లో కూడా చర్చకు కేంద్ర బిందువుగా మారాయి.
హనియే హత్య.. టెహ్రాన్లోని ఘటన
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హత్యకు గురయ్యాడు. ఇరాన్ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి హాజరైన హనియే, అదే నగరంలో హతమార్చబడ్డాడు. ఇరాన్ ఇది ఒక పథకం ప్రకారం జరిగిన ఇజ్రాయెల్ దాడి అని పేర్కొంది. కానీ, ఇజ్రాయెల్ ఇప్పటివరకు దానిపై స్పష్టత ఇవ్వలేదు. తాజాగా కాట్జ్ చేసిన ప్రకటనతో ఆ అనుమానాలు నివృత్తి అయ్యాయి.