ఇండిగో జాతీయ సంక్షోభాన్ని నారా లోకేశ్ వార్రూమ్లో సమీక్షిస్తున్నారంటూ రిపబ్లిక్ టీవీ డిబేట్లో వ్యాఖ్యానించి, యాంకర్ అర్నబ్ గోస్వామి ప్రశ్నలతో అడ్డంగా బుక్ అయిన అనంతరం దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టీడీపీ నేత దీపక్రెడ్డి… ఆ ఘటన తర్వాత చాలా కాలం పాటు టీవీ డిబేట్లకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే తాజాగా మళ్లీ టీవీ చర్చల్లోకి రీ–ఎంట్రీ ఇస్తూ, ఈసారి ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు.
లోక్సభలో భద్రతా కారణాల రీత్యా ప్రధాని మోడీ హాజరు కాకపోవడంపై ఇటీవల స్పీకర్ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. దాడి జరిగే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో, ప్రధాని లోక్సభకు రావద్దని తానే సూచించానని స్పీకర్ చెప్పడంతో విపక్షాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఈ అంశంపై స్పందించిన దీపక్రెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని పళ్లతో కాంగ్రెస్ మహిళా ఎంపీలు కొరకాలని అనుకున్నట్టు దీపక్రెడ్డి చెప్పారు. అందుకే లోక్సభలో ప్రధాని ప్రసంగించలేదని డిబేట్లో చెప్పారు. టీడీపీ నేత దీపక్రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.
లోక్సభ సభ్యుడు కూడా కాని వ్యక్తి, స్పీకర్ వ్యాఖ్యలను ఆసరాగా తీసుకుని ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ అగ్రనేతల మెప్పు కోసమే ఈ వ్యాఖ్యలు చేశారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి, ఒకప్పుడు నారా లోకేశ్ వార్రూమ్ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా ఫేమ్ తెచ్చుకున్న దీపక్రెడ్డి… ఇప్పుడు ప్రధాని మోడీపై చేసిన సంచలన వ్యాఖ్యలతో మళ్లీ టీవీ డిబేట్లలో హాట్ టాపిక్గా మారారు.








