సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం కొంతమంది యువత ప్రాణాల మీదకు తెచ్చుకునేలా చేసే పనులు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా ఓ యువకుడు చేసిన అలాంటి భయంకరమైన సాహసంపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన “ఫేమస్ కావాలనే ఉద్దేశంతో ప్రాణాలతో ఆటలాడటం పిచ్చితనం. వ్యూస్, లైక్స్ కోసం విలువైన జీవితాలను ఫణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం? ఏదో గొప్ప సాహసం చేసినట్లుగా ఆనందపడడం ఎందుకు? ఈ దృశ్యాలు మీకెంతో వినోదంగా అనిపించినా, ఒక్క తప్పు ప్రాణం తీసే ప్రమాదం కలిగించవచ్చు” అని హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలకు కారణమైన వీడియోలో – ఓ యువకుడు రైలు పట్టాలపై పడుకొని రైలు వస్తున్నా పైకి లేచి కేకలు వేస్తూ అతి ఉత్సాహం ప్రదర్శించాడు. ఆ యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ అవ్వడం, సెలబ్రెటీ స్టేటస్ కోసం యువత ప్రాణాలకు తెగిస్తున్నారు. వ్యూస్, లైక్స్ కోసం ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. రైలు పట్టాల కింద యువకుడి వీడియో వైరల్ కావడంతో ఫాలోవర్స్ కోసం యూత్ చేస్తున్న స్టంట్స్పై మరోసారి చర్చ మొదలైంది.
ఫేమస్ కోసం ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 11, 2025
సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టాలా!?
ఏదో ఘనకార్యం వెలగబెట్టినట్లు ఆ పట్టరాని సంతోషం ఎందుకు.. ఇలాంటివి మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి. pic.twitter.com/GF8PDKdqAf