మోంథా తుఫాన్ (Montha Cyclone) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో విస్తృతంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. నిన్న, నేడు పలు జిల్లాల్లో వర్షాలు విరచిపడగా, అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచాయి. ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో ఈదురుగాలులతో పాటు వర్షాలు కొనసాగుతున్నాయి.
రోడ్లు, విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నది
తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,700 కిలోమీటర్ల మేర రోడ్లు(Roads) దెబ్బతిన్నాయని (Damaged ) ప్రభుత్వం (Government) అంచనా వేసింది. 246 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, అయితే విద్యుత్ సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. పలు తీరప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ప్రమాదం దృష్ట్యా ఆర్టీసీ అధికారులు దూరప్రాంతాల బస్సు సర్వీసులను రాత్రి నుండి నిలిపివేశారు.
అన్నదాతకు గుండెకోత
తుఫాన్ ప్రభావం వ్యవసాయరంగంపై తీవ్రంగా పడింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో పంటలకు భారీ నష్టం సంభవించింది. అలాగే ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. గోదావరి జిల్లాల్లో పొట్టకొచ్చిన వరి పంట తీవ్ర నష్టాన్ని చవిచూసింది. వరి, మొక్కజొన్న, చెరకు, వేరుశనగ, కంది, మినుము, పెసర, పత్తి, అరటి, బొప్పాయి వంటి ఉద్యాన మరియు ఆహార పంటలు కూడా తీవ్ర ప్రభావానికి గురయ్యాయి.
మోంథా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాలు భారీ వర్షాలు, ఈదురుగాలులతో అల్లకల్లోలమయ్యాయి. రోడ్లు, విద్యుత్ లైన్లు దెబ్బతినగా, పంటలకు భారీ నష్టం సంభవించింది. ప్రభుత్వం పునరుద్ధరణ పనులు చేపట్టింది.





 



