ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రస్తుతం తీవ్ర చలి వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్ దిగువన పడిపోతున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా, విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో ఈ నెల 8 వరకు పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుపుతోంది. ముఖ్యంగా జనవరి 6న తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో..
ఈ చలి ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా క్రమంగా పడుతోంది. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో కూడా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. చలి తీవ్రతకు ఉదయాన్నే బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. పొగమంచు కారణంగా పలు ప్రాంతాల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.