ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన రెండో వన్డే (Second ODI)లో 2 వికెట్ల తేడాతో భారత్(India) ఓడిపోవడంతో, మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో కోల్పోయింది. అడిలైడ్లో భారత్ ఓడిపోవడం గత 17 ఏళ్లలో ఇదే మొదటిసారి. మెరుగైన బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శించినప్పటికీ, కీలక క్షణాల్లో పట్టు కోల్పోవడం భారత్కు నిరాశను మిగిల్చింది. ఈ ఓటమితో జట్టు ఎంపికపై, ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) వ్యూహంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
కుల్దీప్ (Kuldeep)ను తప్పించడంపై విమర్శలు: పిచ్ పరిస్థితులను అర్థం చేసుకుని ఆస్ట్రేలియా జట్టు స్పిన్నర్ ఆడమ్ జంపాను తీసుకుంటే, భారత్ మాత్రం ముగ్గురు ఆల్రౌండర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగింది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్నప్పటికీ, గంభీర్ బ్యాటింగ్ డెప్త్ను కారణంగా చూపిస్తూ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను వరుసగా రెండో మ్యాచ్లోనూ బెంచ్కే పరిమితం చేశారు. ఆసీస్ తరఫున ఆడిన జంపా 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవడంతో, గంభీర్ ఆల్రౌండర్ల వ్యూహం పూర్తిగా బెడిసికొట్టిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (73), శ్రేయస్ అయ్యర్ (61) హాఫ్ సెంచరీలు చేయగా, అక్షర్ పటేల్ (44) రాణించాడు. 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్, స్టార్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయినా.. మాథ్యూ షార్ట్ (74), కూపర్ కొన్నోలీ (61 నాటౌట్) అద్భుతంగా రాణించి జట్టును గెలిపించారు. ఇరు జట్ల మధ్య చివరి వన్డే అక్టోబర్ 25న సిడ్నీలో జరగనుంది.





 



