తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నెలకొన్న సంఘటనలు, వివాదాలపై చర్చించేందుకు నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ కానున్నారు. ఈ భేటీలో టాలీవుడ్ ప్రముఖులు పాల్గొని కీలక అంశాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరుగనున్న ఈ సమావేశంలో దిల్ రాజు, చిరంజీవి, వెంకటేశ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్ (బన్నీ) తదితరులు పాల్గొంటారు.
చర్చకు ప్రధానాంశాలు..
ఈ భేటీలో ముఖ్యంగా బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు, సంబంధిత వివాదాలపై చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇటీవలి సంధ్య థియేటర్ ఘటన తరువాత, ఈ వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం, సినీ ప్రముఖులు కలిసి పని చేయాలని కోరుకుంటున్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన సందర్భంగా అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ, తాను సీఎం కుర్చీలో ఉన్నంత వరకు సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదు అంటూ ఖరాఖండిగా చెప్పేశారు. ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ కూడా సినిమా పరిశ్రమ ఓ వ్యాపార సంస్థగా అభివర్ణించారు. మరి ఇప్పుడు సినీ ప్రముఖులు దిగిరావడంతో సీఎం రేవంత్ శాంతిస్తారా..? లేక తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని చెప్తారా అనేది వేచి చూడాలి.