ప్రకాశం జిల్లా (Prakasam District) ఒంగోలు నగరంలో మంగళవారం జరిగిన టీడీపీ (TDP) నేత ముప్పవరపు వీరయ్య చౌదరి (50) (Muppavarapu Veerayya Chowdary) హత్య సంచలనంగా మారింది. స్థానికులు, పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి చెందిన వీరయ్య చౌదరి మద్యం సిండికేట్, స్థిరాస్తి వ్యాపారాలలో ప్రముఖుడు. గతంలో బాపట్ల పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు.
వీరయ్య ఒంగోలు రెవెన్యూ కాలనీలోని ఓ భవనం రెండో అంతస్తులో కార్యాలయం నిర్వహిస్తున్నారు. మంగళవారం వ్యక్తిగత పనులతో హైదరాబాద్ వెళ్లిన ఆయన, సాయంత్రం తిరిగి ఒంగోలు వచ్చారు. సుమారు 7.35 గంటల సమయంలో, ముఖాలకు రుమాళ్లు కట్టుకున్న నలుగురు దుండగులు రెండు బైక్లపై అక్కడికి చేరుకుని, వీరయ్యపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. దుండగులు వీరయ్యపై ఛాతీ, గొంతు, పొట్ట ప్రాంతాల్లో పదిహేను సార్లు కత్తితో పొడిచారు. తీవ్ర గాయాలపాలైన వీరయ్యను తొలుత కిమ్స్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. మద్యం, స్థిరాస్తి వ్యాపారాల వ్యవహారాల్లో ఆయనకు కొన్ని విభేదాలు ఉన్నట్టు సమాచారం. అదే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు..
సీఎం చంద్రబాబు (CM Nara Chandrababu Naidu) కాసేపట్లో అమరావతి నుంచి హెలికాఫ్టర్లో ఒంగోలుకు వెళ్లనున్నారు. హత్యకు గురైన టీడీపీ నేత వీరయ్య చౌదరి భౌతికకాయానికి (Mortal Remains) సీఎం చంద్రబాబు నివాళులర్పించనున్నారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్లో నేరుగా గన్నవరానికి, గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్లనున్నారు. కశ్మీర్లో ఉగ్రదాడిలో మృతిచెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి అంత్యక్రియలు రేపు విశాఖలో జరగనున్నాయి. చంద్రమౌళి అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.