దావోస్‌లో రూ.37 కోట్ల ఖర్చుపై అవినీతి ఆరోపణలు

దావోస్‌లో రూ.37 కోట్లు ఖర్చుపై అవినీతి ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) 2025 కార్యక్రమం కోసం దాదాపు రూ.37 కోట్లు ఖర్చు వెనుక అవినీతి ఆరోపణలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (APEDB) సేవలందిస్తున్న సంస్థల ఎంపిక, కాంట్రాక్టుల ఖర్చులపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యయాలు ఎక్కువగా తెలుగుదేశం పార్టీ (TDP)కి అనుబంధ వ్యక్తులకు ప్రయోజనాలు చేకూర్చారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వివరాలను పోస్టు చేస్తున్నారు.

కియారీ వెంచర్స్‌ చైర్మన్‌పై ఆరోపణలు
2016 నుంచి APEDB, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ (CII AP) ద్వారా స్విట్జర్లాండ్‌లోని కియారీ వెంచర్స్ అనే సంస్థతో కలిసి పనిచేసింది. TDPతో బ‌ల‌మైన‌ సంబంధం ఉన్న ఈ సంస్థకు పారద ర్శకత పాటించ‌కుండా కాంట్రాక్టులు ఇచ్చిన‌ట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కాంట్రాక్టులు ఎక్కువగా నామినేషన్ ఆధారంగా ఇచ్చారు. మార్కెట్ రేట్లతో పోలిస్తే 5 నుండి 10 రెట్లు అధికంగా ధరలను చూపారని ఈ వివరాల ద్వారా తెలుస్తోంది.

2022లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో దావోస్‌లో జరిగిన WEF ఈవెంట్‌కు హాజరైన ఏపీ ప్రభుత్వం, ఈ ధరల ఎగవేతలను గుర్తించింది. ఫలితంగా APEDB, CII AP కియారీ వెంచర్స్‌ను బ్లాక్‌లిస్ట్ చేశాయి. అయినప్పటికీ, 2024లో ఇన్వెస్ట్ ఇండియా ద్వారా ప్రాజెక్ట్ పొందిన కియారీ వెంచర్స్, పనులను సక్రమంగా పూర్తి చేయకపోవడంతో మ‌ళ్లీ బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్లిపోయాయి.

2024లో మళ్లీ కియారీ వెంచర్స్ యాక్టివ్
అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం ఏపీలో ప్ర‌భుత్వ మార్పు తరువాత కియారీ వెంచర్స్ TDP మళ్లీ ద‌గ్గ‌రైంది. అధికారులతో మళ్లీ సంబంధాలు మెరుగుప‌రుచుకుంది. ఢిల్లీలోని ప్రిమస్ పార్టనర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మధ్యవర్తి సంస్థ ద్వారా ఈ సంస్థకు కాంట్రాక్టులు పొందడానికి వ్యూహం రూపొందించారని ఆరోపణలు ఉన్నాయి. బ్లాక్‌లిస్ట్ తొల‌గించ‌డంతో ఈ వ్యూహం సహాయపడిందని, అనుబంధ వ్యక్తులకు ఆర్థిక లాభాలు చేకూర్చిందని విమర్శలు ఉన్నాయి.

దావోస్‌లో అధిక ధరల చెల్లింపులు
WEF 2025 కోసం, APEDB ప్రిమస్ పార్టనర్స్‌కు లాజిస్టిక్స్ కాంట్రాక్ట్‌ను పారదర్శక టెండర్ ప్రక్రియ లేకుండానే అప్పగించింది. ప్రిమస్, ఈ లాజిస్టిక్స్ కాంట్రాక్టులను మళ్లీ కియారీ వెంచర్స్‌కు సబ్‌కాంట్రాక్ట్ చేయగా, సర్వీసుల ధరలు మార్కెట్ రేట్లతో పోలిస్తే 4-5 రెట్లు ఎక్కువగా పెరిగాయని ఈ వివరాలు సూచిస్తున్నాయి.

ఉదాహరణకు, దావోస్‌లో ఫ్రాంక్‌లికు లాంటి గెస్ట్ హౌస్‌లు అక్కడి ధ‌ర ప్ర‌కారం 38,000 లభించినప్పటికీ, ప్రభుత్వం 64,000 యూరోలు చెల్లించినట్లు సమాచారం. ఇలాగే, చాలెట్ అటెలియర్ కోసం అక్క‌డి ధ‌ర ప్ర‌కారం 19,000 ఫ్రాంక్స్ రేటుకు బదులుగా 55,000 యూరోలు చెల్లించారట. గెస్ట్ హౌస్‌లు లాంటి ప్రాపర్టీలు స్విస్ క‌రెన్సీ ప్ర‌కారం 27,000 ధరకు లభించగలిగినా, ప్రభుత్వం 99,500 యూరోలు చెల్లించిందని చెబుతున్నారు. ఇంతే కాకుండా, బెంజ్ వి-క్లాస్ లాంటి ప్రయాణ సేవలకు కూడా అధిక ధరలు చెల్లించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వం అత్యధిక ధరలకు చెల్లింపులు జరపడం వల్ల ప్రజాధనం వృథా అయినట్లు స్పష్టమవుతోంది. ఈ అనుమానాలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చి, ఆర్థిక పారదర్శకతకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment