ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల (Pastor Praveen Pagadala) (45) మృతి తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతోంది. ఆయన మరణ వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ సమాజాన్ని(Christian Community) తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రాజమండ్రి (Rajahmundry) దివాన్ చెరువు – కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ పడి ఉండటంతో ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించాయంటూ.. ఆయన అనుచరులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు హైదరాబాద్కు(Hyderabad) చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల.. రాజమండ్రికి ఎందుకు వెళ్లారనేదీ తెలియడం లేదు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి బైక్ మీద వెళ్తున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. బైక్ మీద వెళ్తున్న సమయంలో వెనుక నుంచి ఢీకొట్టి, దాడి చేసి ఉంటారంటూ ప్రవీణ్ పగడాల సన్నిహితులు, అనుచరులు ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ పగడాల ఒంటిపై గాయాలు (Injuries) ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
మరణానికి ముందు ప్రవీణ్ పగడాల వీడియోలు కొవ్వూరు టోల్ గేట్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో(CCTV Cameras) రికార్డయ్యాయి. అప్పుడు సమయం సుమారు 11.30 గంటలు కావస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ కాస్త స్లో గా ఆయన తన బుల్లెట్ బైక్ ని నడుపుతున్నారు. హెడ్లైట్ వేయకుండా ఇండికేటర్ (Indicator) వేసుకుని బండి నడుపుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత కాస్త దూరంలో ఆయన మరణించిన ప్రదేశం ఉంది. అయితే ఆయన మృతి చెందిన ప్రాంతం కొంతమూరు వద్ద.. ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు తాజాగా విడుదల చేసిన మరో సీసీ ఫుటేజ్లో తెలుస్తోంది. కొవ్వూరు టోల్గేట్ నుంచి ప్రవీణ్ మృతి చెందిన ప్రాంతానికి 11 నిమిషాల్లో చేరినట్లు తెలుస్తోంది.అక్కడ ఆయన బుల్లెట్ బైక్కి ఒక్కసారిగా ఏదో అయినట్టు విజువల్స్లో తెలుస్తోంది.కానీ ఏం జరిగింది అన్నది స్పష్టంగా అర్థం కావడం లేదు. అప్పుడు కూడా ఆయన బండికి హెడ్లైట్ వెలగలేదు.
ప్రవీణ్ పగడాల మృతి సహజ ప్రమాదమా లేక పథకం ప్రకారం చేసిన హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు (Investigation) ప్రారంభించారు. ఈ ఘటన వెనుక కుట్ర (Conspiracy) కోణం ఉండొచ్చని క్రైస్తవ (Christian) పెద్దలు అభిప్రాయపడుతున్నారు. గత కొంతకాలంగా పాస్టర్ ప్రవీణ్ కు కొందరు వ్యతిరేకంగా ఉన్నారని, దాడి చేస్తాం, శరీర భాగాలను కత్తిరిస్తామని పలువురు వీడియో రూపంలో బెదిరింపులకు దిగడంతో ఆయన మరణం అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రవీణ్ పగడాల మృతి వెనుక అసలు కారణాలను వెలికితీయాలని, న్యాయ సమగ్ర దర్యాప్తు జరపాలని అనేక మంది పాస్టర్లు, మత పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. పోస్టు మార్టం (Post-Mortem) రిపోర్టులో అసలు విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.