వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల జారీ సందర్భంగా తిరుమలలో జరిగిన తొక్కిసలాటపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ ఘటనపై టీటీడీ వైఫల్యం లేదని, భక్తులు ఆకలితో నిలబడడం వల్లే సమస్య ఉత్పన్నమైందని ఆయన అన్నారు.
భక్తులను ఎవరూ తొక్కలేదని, వారు లైన్లో చాలా సమయం పాటు నిలబడి ఏమి తినకపోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోయి సొమ్మసిల్లి పడిపోయారని చింతా మోహన్ తెలిపారు. తిరుమలలో ఈ పరిస్థితులకు టీటీడీ, ప్రభుత్వం, లేదా పోలీసుల తీరుకు సంబంధం లేదని స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే టీటీడీ ఇప్పుడు మెరుగైన సేవలు అందిస్తోందని అభిప్రాయపడ్డారు. చింతామోహన్ వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొక్కిసలాట జరిగికి భక్తులు మరణిస్తే.. అవన్నీ ఆకలి చావులుగా ఆయన చిత్రీకరించడం ఏంటని మండిపడుతున్నారు.
ప్రజల ఆగ్రహం
తిరుపతి ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు, దీంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గేట్లు ఒక్కసారిగా తెరవడం, లాఠీచార్జి జరగడం, గాయపడిన వారికి సకాలంలో అంబులెన్స్ సదుపాయం లేకపోవడమే కారణమని భక్తులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీని మద్దతుగా మాట్లాడిన చింతామోహన్ వ్యాఖ్యలు భక్తులలో ఆగ్రహానికి గురి చేస్తున్నాయి.