లిక్కర్ కేసు (Liquor Case)లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి (Chevireddy Bhaskar Reddy) ఏసీబీ కోర్టు (ACB Court)లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కక్షపూరితంగా తనను ఈ కేసులో ఇరికించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కోర్టులో విచారణకు హాజరైన సమయంలో చెవిరెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేశారు.
“నా కుటుంబం మొత్తం మద్యం కారణంగా చిన్నాభిన్నం అయ్యింది. అలాంటి నాకు లిక్కర్ కేసులో ప్రమేయం ఉంటుందని చెప్పడం ఎంతవరకు న్యాయం?” అంటూ ప్రశ్నించారు. వందల ఏళ్ల పూర్వీకుల సంపాదించిన ఆస్తులను అటాచ్మెంట్లోకి తీసుకురావడం ధర్మం కాదని ఆయన తీవ్రంగా విమర్శించారు.
“నేను కష్టపడి సంపాదించిన ఆస్తులను, లిక్కర్ ద్వారా సంపాదించానని చెబుతున్నారు. నేను ఇప్పుడు నోరు మెదపకపోతే, తప్పు చేసినట్టే ప్రజలు భావిస్తారు” అని చెవిరెడ్డి అన్నారు. ప్రభుత్వానికి సంతృప్తి కలిగే వరకు జైల్లో పెట్టినా భయం లేదని, ఎన్ని రోజులు కావాలంటే అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. తనపై జరుగుతున్న చర్యలన్నీ రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు.
ఆస్తుల అటాచ్మెంట్ (Property Attachment) నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బహిరంగ లేఖ సైతం విడుదల చేశారు. ఆస్తుల అటాచ్మెంట్పై తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేశారు. “29 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం. స్థలాలు కొనడం, అమ్మడం మా వృత్తి. దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్నా… నేను ఎప్పుడూ లిక్కర్ వ్యాపారం చేయలేదు, ముట్టలేదు” అని ఆయన స్పష్టం చేశారు. పూర్వీకుల ఆస్తుల వరకూ స్వాధీనం చేసుకోవడం అన్యాయం అని పేర్కొంటూ, న్యాయం కోసం చివరిదాకా పోరాడతానని చెవిరెడ్డి తెలిపారు.








