పరమ పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీ నెయ్యిపై సంవత్సర కాలం పాటు నానా యాగీ చేసిన నారా చంద్రబాబు ప్రభుత్వం సుప్రీం కోర్టు నేతృత్వంలో సీబీఐ సిట్ బయటపెట్టిన చార్జ్షీట్ తరువాత బేల ముఖం వేసింది. జంతు కొవ్వు లేదని తేలడంతో ఆ అంశాన్ని పక్కనపెట్టి, ఇంకా అత్యంత దారుణంగా లడ్డూ నెయ్యిలో బాత్రూం క్లీనింగ్ రసాయనాలుంటూ ప్రకటనలు చేసి, తిరుమల లడ్డూ అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకున్న టీడీపీ.. ఆ అంశాన్ని అనూహ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆ అంశాన్ని ప్రస్తావించకుండా దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అనంతరం ఈ మార్పు కనిపించడంతో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈనెల 10న ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులను కలిశారు. అమిత్ షాతో సుమారు గంటపాటు జరిగిన సమావేశంలో శ్రీవారి లడ్డూ వ్యవహారంతో పాటు రాష్ట్ర రాజకీయ పరిణామాలపై కూడా విస్తృతంగా చర్చ జరిగినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

‘అతి చేయడం సరికాదు’
లడ్డూ అంశంపై అధికంగా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ పెద్దలు చంద్రబాబుకు హిత బోధ చేసినట్లుగా సమాచారం. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, దేశ అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలో ఏర్పాటైన సీబీఐ సిట్ ప్రక్రియపై రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవం చూపాల్సిన అవసరం ఉందని, దాన్ని ధిక్కరించేలా లేదా తప్పుపట్టేలా వ్యవహరించడం రాష్ట్ర ప్రభుత్వానికి మర్యాదకరం కాదని కేంద్ర పెద్దలు చంద్రబాబుకు చెప్పినట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
ఇలాంటి వ్యవహారాలు రాజ్యాంగ సంక్షోభాలకు దారి తీసే అవకాశం ఉందని, ఒకవేళ సుప్రీంకోర్టు దీనిపై సీరియస్గా విచారణ చేపడితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చని కూడా హితవు పలికినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో లడ్డూ అంశాన్ని పూర్తిగా ప్రస్తావించకపోవడం గమనార్హం.
ఎల్లో మీడియా వేదికగా కొనసాగింపు..
కేంద్ర పెద్దల ఆదేశాలతో లడ్డూ వ్యవహారాన్ని ప్రభుత్వ స్థాయిలో కాకుండా, తెలుగుదేశం పార్టీ మీడియా వేదికలు ద్వారా కొనసాగించాలనే ఆలోచన టీడీపీ వర్గాల్లో ఉన్నట్టుగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి పత్రికలు, ఛానళ్ల ద్వారా ఈ అంశాన్ని కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా చర్చించుకుంటున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత లడ్డూ అంశంపై చంద్రబాబు స్వరం మారిపోయిందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.








