ఆంధ్ర (Andhra) రాష్ట్ర రాజధాని (Capital) నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యంతో నిధులు సేకరించేందుకు చందాల యత్నం మళ్లీ మొదలవ్వబోతోంది. గతంలో ‘మై బ్రిక్ మై అమరావతి’ (My Brick My Amaravati) పేరుతో ఒక్కో ఈ-ఇటుక (E-Brick)కు రూ.10 చొప్పున విరాళాలు సేకరించిన విధానాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు సీఆర్డీఏ (CRDA) వెబ్సైట్లో ప్రత్యేకంగా “Donate for Amaravati” అనే ఆప్షన్ పెట్టి, క్యూ ఆర్ కోడ్ ద్వారా విరాళాలు ఇచ్చే విధంగా అవకాశం కల్పించింది. చందాల ద్వారా అమరావతిని ప్రజల కలగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పునఃప్రయత్నం చేస్తోంది.
విరాళాల సేకరణకు సీఆర్డీఏ ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. crda.ap.gov.in వెబ్సైట్లో విరాళాల కోసం ప్రత్యేక పేజీ అందుబాటులో ఉంచగా, అక్కడ నుండి QR కోడ్ స్కాన్ చేసి నేరుగా చందా ఇవ్వవచ్చు. ప్రజలంతా రాజధాని నిర్మాణానికి భాగస్వాములవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం పిలుపునిచ్చింది.
అయితే 2015లో సేకరించిన ఈ-ఇటుకల విరాళాలకు సంబంధించి ఎటువంటి లెక్కలూ వెల్లడించని సీఆర్డీఏ ఇప్పుడే మళ్లీ అదే పద్ధతిని అవలంబించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మై బ్రిక్ మై అమరావతి పేరుతో పోర్టల్ ప్రారంభించి దానికి విపరీతమైన పబ్లిసిటీ కల్పించారు. ప్రజలకు నా ఇటుక – నా అమరావతి విరాళాల సేకరణపై అవగాహన కల్పించేందుకు సీఎం కుటుంబం పలకలు పట్టుకొని ప్రచారం చేసింది.
రాజధాని కోసం అప్పులలో కూరుకుపోతున్న ప్రభుత్వం, విరాళాలపై ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే అమరావతి ప్రాజెక్టుల కోసం 31,000 కోట్ల రూపాయల అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం, మరో 70,000 కోట్ల అప్పులు తీసుకునేందుకు ప్రయత్నాలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చే విరాళాలు కొంత బరువు తగ్గిస్తాయనే ఆశతో “అమరావతి విరాళ పథకం” ప్రారంభమైంది. అయితే గత అనుభవాల నేపథ్యంలో ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి.








