11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (11th International Yoga Day) సందర్భంగా విశాఖపట్నం (Visakhapatnam)లో యోగాంధ్ర (Yogandra) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్కే బీచ్ (RK Beach) వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి(PM) నరేంద్రమోడీ (Narendra Modi) పాల్గొన్నారు. మోడీతో పాటు సీఎం చంద్రబాబు (CM-Chandrababu), డిప్యూటీ (Deputy CM) సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మంత్రులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా శరీరం, మనస్సు, ఆత్మలను సమన్వయం చేసే శక్తివంతమైన సాధనమని, ఇది మానసిక, శారీరక ఆరోగ్యానికి మార్గం చూపుతుందని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన ‘యోగాంధ్ర’ (Yogandra) కార్యక్రమం చారిత్రక విజయం సాధించిందని ఆయన వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోడీ యోగాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారని చంద్రబాబు గుర్తు చేశారు. మోడీ చొరవతో ఐక్యరాజ్యసమితి (United Nations) ద్వారా యోగా ప్రపంచ ఆరోగ్య ఉద్యమంగా మారిందన్నారు. యోగాను ఆసియా క్రీడలు, కామన్వెల్త్, ఒలింపిక్స్లో చేర్చేలా మోదీ చొరవ తీసుకోవాలని కోరారు. 175 దేశాల్లో, 12 లక్షల ప్రాంతాల్లో 10 కోట్ల మంది ఈ యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో గత నెల రోజులుగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో 1.44 లక్షల మంది యోగా శిక్షకులకు శిక్షణ ఇచ్చి, 1.40 లక్షల ప్రాంతాల్లో 2.17 కోట్ల మంది యోగాలో పాల్గొన్నారని చంద్రబాబు వివరించారు. విశాఖలో ఒకే ప్రదేశంలో 3 లక్షల మంది పాల్గొనడం, 22,122 మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డు సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన తెలిపారు.
యోగా ద్వారా సంతోషకరమైన, ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని చంద్రబాబు ఉద్ఘాటించారు. “విజన్ స్వర్ణ ఆంధ్ర @ 2047, వన్ ఎర్త్ – వన్ హెల్త్ (One Earth- One Health) లక్ష్యాలతో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతాం” అని ఆయన పేర్కొన్నారు. మోడీ నాయకత్వంలో యోగా, ఆయుర్వేదం, గ్రీన్ ఎనర్జీ, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు పునరుద్ధరణ జరిగాయని, ఇవి ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి దోహదపడుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రధాని మోడీని చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలంకారీ శాలువాతో సన్మానించి, లక్ష్మీ నరసింహస్వామి జ్ఞాపికను అందజేశారు.