ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించి, వాటిని పరిష్కరించాల్సింది అధికార యంత్రాంగం, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు. కానీ, ఆ ప్రక్రియను పూర్తిగా రాజకీయాలకు వాడుకుంటూ చంద్రబాబు సర్కార్ అభాసుపాలవుతోంది. కూటమి సర్కార్ రాగానే ‘‘ప్రజా దర్బార్’’ పేరిట అర్జీలను ప్రతి శనివారం స్వీకరిస్తామని మంత్రి లోకేష్ హడావుడి చేశారు. వాటిని టీడీపీ అనుకూల మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి అర్జీలు స్వీకరిస్తారని ఊదరగొట్టారు. ఆ తర్వాత మంత్రులు వినతులు స్వీకరిస్తారని, అటు తర్వాత ఎమ్మెల్యేలు, అనంతరం కార్పొరేషన్ల డైరెక్టర్లను పురమాయించారు. ప్రస్తుతం వాళ్లు కూడా కనిపించడం లేదు.
ప్రజా సమస్యలపై సరికొత్త ప్రచారం
ప్రజల సమస్యలు తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్లో తీసుకోవడం ఒక ఎత్తు అయితే, వాటికి రాజకీయ రంగు పులమడం మరో ఎత్తుగా మారింది. రెవెన్యూ, భూ సమస్యలు చాలా వరకు వ్యక్తిగతమైనవి. కోర్టు కేసుల వల్లనో, న్యాయ వివాదాల వల్లనో ఇలాంటి సమస్యలపై అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వాటిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం సరికొత్తగా ప్రచారం చేసుకుంటోంది. గత వైసీపీ ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలపైకి నెట్టే విఫలప్రయత్నం చేస్తోంది. వ్యక్తిగత సమస్య అయినా పరిష్కరించకుండా వైసీపీ వల్లే అంటూ చేతులు దులుపుకునే ధోరణితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
గతంలో ఎలా ఉందంటే..
జగన్ పాలనలో గ్రీవెన్స్ పరిష్కారానికి ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేశారు. స్పందన పేరుతో ప్రతి సోమవారం గ్రీవెన్స్ పై అర్జీలను స్వీకరించడం, జగనన్నకు చెబుదాం పేరుతో టోల్ ఫ్రీ నంబర్ 1902 ఏర్పాటు చేసి హెల్ప్ లైన్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించారు. వాటిలో 90 శాతం సమస్యలను త్వరితగతిన పరిష్కరించినట్లు లెక్కలు చెబుతున్నాయి. స్పందన కార్యక్రమానికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డుకు నామినేషన్ వేసే అవకాశం లభించింది. గత వైసీపీ హయాంలో ప్రతి సోమవారం ‘స్పందన’పై జిల్లాల కలెక్టరేట్లలో జరిగింది. వచ్చిన అర్జీలను ఎక్కడికక్కడ విభాగాల వారీగా పంపి త్వరితగతిన పరిష్కారానికి కలెక్టర్లు చొరవ చూపేవారు. సీఎం హోదాలో జగన్ కూడా స్పందన కార్యక్రమంపై ప్రతి నెలా సమీక్ష చేపట్టేవారు.
నేడు కూటమిలో ఎలా ఉందంటే..
కూటమి ప్రభుత్వంలో గ్రీవెన్స్ పరిష్కారం ఎక్కడా కనిపించడం లేదనే ఆరోపణలు విపరీతంగా వినిపిస్తున్నాయి. కేవలం ప్రచార కార్యక్రమంగా, పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం పెట్టిన కార్యక్రమంగా దీన్ని మార్చేశారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ కార్యాలయాల వద్ద తీసుకుంటున్న అర్జీలు పరిష్కారానికి నోచుకోవడం లేదని, అసలు ప్రభుత్వ కార్యాలయాల్లో అర్జీలు తీసుకోకుండా పార్టీ కార్యాలయాల్లో అరకొరగా తీసుకుంటూ ఫొటోలతో మమ.. అనిపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సీఎంను కలిసినా ఏం లాభం?
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు కూడా గత ప్రభుత్వంపై నిందలేయడానికే ఉపయోగపడుతున్నాయి తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి కాదని నిరూపితమవుతోంది. పలు చోట్ల రెవెన్యూ సదస్సులకు జనం రాకపోవడంతో స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నట్లుగా ఇటీవల బహిర్గతమైంది. వైసీపీ నేతల పేర్లు ప్రస్తావిస్తూ ఇచ్చే ఫిర్యాదులు తీసుకోవడానికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సమస్య ఏదైనా సరే వైసీపీ బాధితులమని చెప్పాల్సిందిగా ఫిర్యాదుదారులకు టీడీపీ నేతలు కౌన్సెలింగ్ ఇస్తున్నారట. నిజానికి నేరుగా సీఎం చంద్రబాబుకు అందచేసే విజ్ఞాపనలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆయన్ను కలిసిన వారు వాపోతున్నారు.
పబ్లిసిటీకే ప్రాధాన్యత ఇస్తున్నారా..?
ఇప్పటివరకు 12,862 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు పూర్తయ్యాయి. 2024 డిసెంబర్ నెలాఖరు నాటికి 1,75,182 వినతి పత్రాలు అందగా 12,409 అర్జీలను పరిష్కరించామని చెబుతున్నారు. దీన్నిబట్టి రెవెన్యూ సదస్సులు ఎంత మొక్కుబడిగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చని పలువురు ఫిర్యాదు దారులు ఆరోపణలు చేస్తున్నారు.