కూటమి సర్కార్ కన్ను ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ల వైపు మళ్లింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక స్వరాన్ని చంద్రబాబు సర్కార్ బలంగా ఎదుర్కోలేకపోతోందని, అందుకే సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురిచేసేందుకు పోలీస్ కేసులను ప్రయోగిస్తోందన్న ఆరోపణలు కోకొల్లలు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ సోషల్ మీడియాను టార్గెట్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మెల్లగా వైసీపీ లీడర్ల వైపు, ఆ తదుపరి యూట్యూబ్ ఛానళ్ల వైపు దృష్టి మళ్లించింది. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడకపోతే కేసు నమోదు చేయాల్సిందేనన్న ధోరణితో వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మనోభావాలు దెబ్బతిన్నాయన్న సాకుతో చంద్రబాబు ప్రభుత్వం న్యూట్రల్ జర్నలిస్టులను కూడా వదలడం లేదు. వాస్తవాలు ఎవరు మాట్లాడినా వారిని టార్గెట్ చేస్తూ వారిపై కేసులు బుక్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయం, పబ్లిక్ పాలసీల్లోని లోపాల గురించి మాట్లాడుతున్న యూట్యూబర్లపై వరుసగా కేసులు నమోదు చేస్తోంది. ఇటీవల ఆంధ్రపాడ్క్యాస్టర్ విజయ్ కేసరి ఫ్యామిలీ టీడీపీ టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. రేణుక జెట్టి అనే టీడీపీ మహిళా నేత ఏ విధంగా తనను, తన భార్యను దుర్భాషలాడిందో ఓ వీడియో ద్వారా విజయ్ కేసరి వివరించారు.
అలర్ట్ ఉండండి అన్నందుకు కేసు..
తాజాగా మరో రెండు యూట్యూబ్ ఛానళ్ల నిర్వహకులపై కేసులు నమోదయ్యాయి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ పేరుని కొందరు టీడీపీ నేతలు బద్నాం చేస్తున్నారని, అలర్ట్గా ఉండండి అంటూ ప్రశ్న యూట్యూబ్ ఛానల్ ఓ వీడియో విడుదల చేసింది. అప్రమత్తంగా ఉండండి అని సూచించిన ప్రశ్న ఛానల్పై మనోభావాలు దెబ్బతిన్నాయి అనే సాకుతో ఎఫ్ఐఆర్ నమోద అయ్యింది.
సలహా, సూచనలు ఇచ్చినా..
ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు ఎప్పుడు తిరుమలకు వచ్చినా ఆయన్ను తిరుమల శ్రీవారి మహాద్వారం పక్కనున్న బయోమెట్రిక్ ద్వారం ద్వారా దర్శనానికి తీసుకెళ్లేవారని, ఈసారి అలా జరగకపోవడం ఆయన్ను అవమానించడమే అనే చర్చ తిరుమలలో జరుగుతుందని, టీటీడీ నిర్వహించే పలు కార్యక్రమాల్లో చాగంటి సేవలను వినియోగించుకుంటే బాగుండేదన్న సూచన చేసినందుకు జర్నలిస్టు వైఎన్ఆర్ఛానల్పై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. డయల్ న్యూస్, పోస్ట్ 360 పై కేసు నమోదు చేశారు.
ప్రభుత్వ పాలసీల్లోని లోపాలను ఎత్తిచూపినందుకు తమపై కేసులు నమోదవుతున్నాయని, రాజ్యాంగం కల్పించిన హక్కు భావప్రకటన స్వేచ్ఛ ప్రకారమే తాము నడుచుకుంటున్నామని ఆ యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు అంటున్నారు.