తాజా పరిస్థితులు గమనిస్తే ఈ ప్రశ్న ఉత్పన్నం కాకతప్పదంటున్నారు ఆంధ్రరాష్ట్ర ప్రజలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7నెలల కాలం గడుస్తున్నా.. ప్రజలకు ఇచ్చిన పథకాలు అమలు కాలేదు కానీ, చంద్రబాబు మద్దతుదారుగా పేరుగాంచిన ఏబీ వెంకటేశ్వరరావు రెండు బెనిఫిట్లు పొందాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ రెండు కూడా నెలరోజుల వ్యవధిలోనే చాలా పెద్ద రిలీఫ్ ఇచ్చేవి కావడం గమనార్హం.
ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొని, కేంద్రప్రభుత్వ జోక్యంతో సస్పెన్షన్కు గురైన మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు చంద్రబాబు ప్రభుత్వం నెలరోజుల వ్యవధిలోనే డబుల్ బొనాంజా అందించింది. గత నెల డిసెంబర్ 22న ఆయనపై కొనసాగుతున్న క్రమశిక్షణ చర్యలను ఉపసంహరించుకుంటున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. నెలక్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీరబ్ కుమార్ దీనిపై ఉత్తర్వులు జారీ చేశారు.
తాజాగా ఏబీ వెంకటేశ్వరరావుకు మరో బహుమతిచ్చింది. ఏబీవీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇంటెలిజెన్స్ ఏడీజీగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలతో వైసీపీ హయాంలో రెండు దఫాలుగా ఏబీవీపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా క్రమబద్ధీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
మొదటి దఫా 2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు, రెండో విడతలో 2022 జూన్ 28 నుంచి 2024 మే 30 వరకు మరోమారు సస్పెన్షన్కు గురయ్యారు. ఆ కాలానికి ఏబీవీకి చెల్లించాల్సిన మొత్తం వేతనం, అలవెన్సులు చెల్లించాలని చంద్రబాబు సర్కార్ ఆదేశాలిచ్చింది. సస్పెన్షన్ వేటు పడకపోతే ఎంతమొత్తం ఇవ్వాలో ఆ మేరకు చెల్లించాలని చెప్పింది.
ఇంటెలిజెన్స్ ఏడీజీగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా తన కుమారుడి పేరుతో ఉన్న కంపెనీ ద్వారా నిఘా పరికరాలు కొనుగోలు చేసినట్లు, ఆ పరికరాల ద్వారా ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా ఏబీ వెంకటేశ్వరరావుపై అభియోగాలు ఉన్నాయి. దీనిపై గత వైసీపీ ప్రభుత్వం ఎంక్వైరీ విధించగా, ఫోన్ల ట్యాంపింగ్ నిజమేనని తేలింది. కేంద్ర హోంశాఖ సైతం ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చింది. ఆలిండియా సర్వీస్ నిబంధనల ప్రకారం ఏబీ వెంకటేశ్వరరావుపై గత వైసీపీ ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టింది.
జగన్ను తిట్టినందుకు మరో బెనిఫిటా..?
కేంద్ర ప్రభుత్వ జోక్యంతో ఏబీవీపై సస్పెన్షన్ వేటు పడినప్పటికీ ఆయనపై క్రమశిక్షణ చర్యలు ఉపసంహరించుకోవడం, సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరిస్తూ డబ్బులు చెల్లించాలని చెప్పడంపై రాజకీయ విమర్శలు తీవ్రమయ్యాయి. ఇటీవల వైఎస్సార్, వైఎస్ జగన్పై ఏబీవీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. జగన్ను తిట్టినందుకే చంద్రబాబు సర్కార్ నుంచి మరో బెనిఫిట్ పొందారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. హామీల అమలుకు డబ్బులు చేతులెత్తేసి.. తనవారికి మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ డబ్బు కట్టబెడుతున్నాడని ఆరోపిస్తున్నారు.