ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.3.22 కోట్లతో అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. సూపర్ సిక్స్ పథకాలకు అగ్రతాంబూలం అని కూటమి సర్కార్ చెబుతున్నప్పటికీ, బడ్జెట్లో కీలక అంశాలను చంద్రబాబు ప్రభుత్వం మరిచిపోయింది. ఎన్నికల ప్రచార సభల్లో కూటమి నేతలు ఊదరగొట్టి ప్రజల నుంచి విశేష ఆదరణ పొందిన కీలక పథకాల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం గమనార్హం.
ఉచిత బస్సు, రూ.1500 లేవు..
మహిళల మహాశక్తి పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామని, మహిళలకు ఉచిత బస్సు పథకం మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ బడ్జెట్లో ఈ రెండు పథకాలకు కూటమి ప్రభుత్వం రూపాయి కూడా కేటాయించకపోవడంతో ఈ ఏడాది మహిళలకు నెలకు రూ.1500, ఉచిత బస్సు ప్రయాణం లేదని తేలిపోయింది.
నిరుద్యోగ భృతికి పైసా లేదు
ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ప్రకటించిన నిరుద్యోగ భృతి పథకం యువతను విశేషంగా ఆకట్టుకుంది. ప్రభుత్వం రాగానే రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడంతో వారంతా కూటమి వైపు మొగ్గు చూపారు. కానీ, నమ్మి ఓటేసిన నిరుద్యోగుల కోసం బడ్జెట్లో పైసా కేటాయింపు లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.
50 ఏళ్లకే పెన్షన్..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని కూటమి పార్టీలు ప్రకటించాయి. కానీ, బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చిన హామీని చంద్రబాబు ప్రభుత్వం విస్మరించింది. బడ్జెట్లో ఈ అంశానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం గమనార్హం.
- భారీ కోత విధించిన పథకాలు..
తల్లికి వందనం పథకంలో భాగంగా ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున అంటే రూ.12,450 కోట్లు బడ్జెట్లో కేటాయించాల్సి ఉండగా, కూటమి ప్రభుత్వం రూ.9,407 కోట్లు మాత్రమే కేటాయించింది. - అన్నదాత సుఖీభవకు భారీగా కోత విధించింది. రైతుకు రూ.20వేల చొప్పున ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ పథకం కోసం రూ.10,400 కోట్లు అవసరం కాగా, రూ.6,300 కోట్లు మాత్రమే కేటాయించింది.
- దీపం పథకానికి భారీగా కోత విధించింది. 1.55 కోట్ల లబ్దిదారులను 90 లక్షలకు కుదించి బడ్జెట్ లో రూ.4వేల కోట్లకుగానూ రూ.2,601 కోట్లే కేటాయించింది.
- డ్వాక్రా మహిళలకు రూ.10లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ప్రకటించని చంద్రబాబు సర్కార్.. బడ్జెట్లో ఆ హామీకి సంబంధించి కేటాయింపులు చూపలేదు.