కూటమి ప్రభుత్వం (Coalition Government)పై వైసీపీ (YSRCP) తీవ్ర విమర్శలు గుప్పించింది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు (Farmers) న్యాయం చేయాల్సిన కూటమి ప్రభుత్వం.. హామీల అమలులో జాప్యం ముసుగులో తీరని ద్రోహం చేస్తోందని ఆరోపించింది. ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు (Chandrababu) నేతృత్వంలోని ప్రభుత్వం రైతు భరోసా పథకానికి తీవ్రంగా కోతలు పెట్టిందని, గత వైఎస్ జగన్ (YS Jagan) ప్రభుత్వంలో లభించిన ప్రయోజనాలన్నింటిని రైతులకు దూరం చేసిందని ఆరోపించారు.
వైసీపీ వెల్లడించిన వివరాల ప్రకారం, రైతు భరోసా పథకంలో గత ప్రభుత్వం 53.58 లక్షల కుటుంబాలకు లబ్ది కలిగించగా, ప్రస్తుతం కేవలం 46.85 లక్షల కుటుంబాలకు మాత్రమే ఆర్థిక సహాయం అందుతోంది. ఇది అంటే దాదాపు 7 లక్షల మంది రైతు కుటుంబాలకు ఈ పథకం అందకుండా చేశారని, ఏవేవో సాకులు చూపించి, అనర్హులుగా ప్రకటించారని లెక్కలు చూపింది. గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.20 వేలకు కూడా పూర్తిగా ఎగనామం పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు కేవలం రూ.5 వేలు మాత్రమే విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిందని వైసీపీ చెబుతోంది.
ఇది కూడా పూర్తిగా రాష్ట్ర నిధులతో కాకుండా, కేంద్రం ఇస్తున్న పీఎం కిసాన్ సహాయాన్ని కలుపుకుని చూపిస్తుండటం బాధాకరమని వైసీపీ పేర్కొంది. గత ఏడాది రాష్ట్రం మొత్తం రైతులకు రూ.10,800 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ప్రభుత్వం వాటి ఊసే ఎత్తడం లేదని, రైతులకు కూటమి ప్రభుత్వం రూ.10,800 కోట్లు బాకీ పడిందని చెప్పింది. ఈ ఏడాది రైతు భరోసా సాయం కోసం కూటమి ప్రభుత్వం కేవలం రూ.2,342 కోట్లు మాత్రమే విడుదల చేసిందని తెలిపింది. ఎన్నికల సమయంలో ప్రతి రైతు కుటుంబానికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడు మాట మార్చారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కలుపుకొని 20 వేల రూపాయలు అని రైతులకు వెన్నుపోటు పొడుస్తోందని వైసీపీ మండిపడుతోంది.