ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి (Chief Minister) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నేతృత్వంలోని మంత్రివర్గం (Cabinet) సరికొత్త సంప్రదాయానికి తెరలేపుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు కుటుంబాల వివాదాల మూలంగా హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త (TDP Worker) తోట చంద్రయ్య (Thota Chandrayya) కుమారునికి (Son) శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం (Permanent Government Job) కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త సంప్రదాయానికి తెరలేపింది. పోలీసులు, అధికారులు, ఎమ్మెల్యేలు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చినట్లే.. టీడీపీ కార్యకర్త కుటుంబానికి శాశ్వత ఉద్యోగం ఇస్తున్నామని ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. కాగా, ప్రభుత్వ నిర్ణయం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలకు గురవుతోంది.
రెండు కుటుంబాల మధ్య గొడవ
2022 జనవరిలో, పల్నాడు జిల్లా (Palnadu District) వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు (Gundlapadu) చెందిన టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక వ్యక్తిగత కక్షలు ఉన్నాయని పోలీసులు అప్పట్లో ప్రకటించారు, ఇది రెండు కుటుంబాల మధ్య వివాదంగా గుర్తించారు. చంద్రయ్య కుటుంబం ఒక కుటుంబంపై అప్పట్లో ఫిర్యాదు చేసింది. వ్యక్తిగత వివాదాలతోనే హత్య జరిగిందని పోలీసులు ప్రకటించినా.. రాజకీయ కక్షతో జరిగిందని టీడీపీ నాయకులు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా గుండ్లపాడుకు వెళ్లి తోట చంద్రయ్య పాడె మోశారు.
వారికి ఇచ్చినట్టుగానేనా..?
నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో, చంద్రయ్య కుమారునికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ నిర్ణయం కోసం అవసరమైన సవరణలను కేబినెట్ ఆమోదించింది. మంత్రి పార్థసారథి (Minister Parthasarathi) మాట్లాడుతూ “పోలీసులు, అధికారులు, ఎమ్మెల్యేలు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చినట్లే, ఈ కేసులో కూడా అదే విధంగా ఉద్యోగం ఇస్తున్నాము” అని వివరించారు.
ఉత్సాహం ఉంటే పార్టీ పరంగా చేయండి..
ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ నాయకులు సమర్థిస్తుండగా, ప్రతిపక్షాలు, రాజకీయ పండితులు తప్పుబడుతున్నారు. టీడీపీ కార్యకర్త కుటుంబానికి శాశ్వత ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతగా చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేయాలని ఉంటే.. పార్టీ పరంగా అధిక మొత్తంలో ఎక్స్గ్రేషియా అందించి, పార్టీలో కీలక పదవి కట్టబెట్టుకోండి అని సలహాలు ఇస్తున్నారు. “వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్య కేసులో బాధిత కుటుంబానికి శాశ్వత ఉద్యోగం ఇవ్వడం సమంజసమా?” అని ప్రశ్నిస్తున్నారు. కొందరు ఈ నిర్ణయాన్ని రాజకీయ లబ్ధి కోసం తీసుకున్న చర్యగా ఆరోపించారు. మరికొందరు ఇది రాష్ట్రంలో ఒక చెడు సంప్రదాయానికి నాంది అని విమర్శిస్తున్నారు.
కొత్త సంప్రదాయం..
ప్రభుత్వ ఉద్యోగాల కేటాయింపు సాధారణంగా నిర్దిష్ట అర్హతలు, పోటీ పరీక్షలు, నియామక ప్రక్రియల ద్వారా జరుగుతుందని, అధికారంలో ఉన్న పార్టీలు నచ్చినవారికి కేటాయిస్తామంటే ఎలా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైరవుతున్నారు. వ్యక్తిగత కక్షల మూలంగా హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి ఉద్యోగం కల్పించేందుకు కేబినెట్ సవరణలు చేయడంతో ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెరలేపిందని మండిపడుతున్నారు. తరువాత వచ్చే ప్రభుత్వాలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్న వినిపిస్తుండగా, ప్రభుత్వ ఉద్యోగాలను రాజకీయ ఆధారంగా కేటాయించడం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతలో అసంతృప్తిని కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.