ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను వణికించిన మొంథా తుఫాన్ (Montha Cyclone) ప్రభావాన్ని ముఖ్యమంత్రి (Chief Minister) నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్వయంగా పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా కోనసీమ, గోదావరి, ప్రకాశం జిల్లాల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తుఫాన్ తీవ్రతను అంచనా వేస్తూ, అధికారులు తీసుకున్న చర్యలను సమీక్షించారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మొంథా తుఫాన్ వల్ల ఒక్క ప్రాణం కూడా నష్టపోలేదని, ఒక్క ప్రాణం కూడా పోకూడదని తాను ఆదేశించానని చెప్పారు. “కోనసీమకు పెనుముప్పు తప్పింది. రాష్ట్రానికి ఇది ఒక పెద్ద విపత్తు అయినా, కొంతవరకు కాపాడుకోగలిగాం. విపరీతమైన ఆస్తి నష్టం జరిగినా, ప్రాణనష్టం లేకుండా కాపాడగలిగాం,” అని పేర్కొన్నారు. ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ఈసారి పెద్ద ప్రమాదం తలెత్తలేదని ఆయన తెలిపారు.
“2200 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి లక్షా 80 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. విద్యుత్ సరఫరాను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాం. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేశాయి” అని సీఎం తెలిపారు. తుఫాన్ వల్ల ఇద్దరు వ్యక్తులు మరణించారని, నష్టపోయిన రైతులకు, ముఖ్యంగా కౌలు రైతులకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆస్తి నష్టం వివరాలు వచ్చిన వెంటనే సాయంపై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు వెల్లడించారు. ఒక్క ప్రాణం కూడా నష్టపోలేదని చెప్పిన సీఎం.. తుఫాన్ కారణంగా ఇద్దరు మరణించారని చెప్పడం గమనార్హం.





 



