వన్ నేషన్ – వన్ ఎలక్షన్ విధానంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం పలికింది. ఈ బిల్ను పార్లమెంట్లో త్వరలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. గతంలో కోవింద్ కమిటీ చేసిన సిఫారసులకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, జమిలి ఎన్నికల నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. 13, 14 తేదీల్లో తప్పనిసరిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలని బీజేపీ తమ ఎంపీలకు విప్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అన్ని ఎలక్షన్లు ఒకేసారి నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో రూపొందించిన నివేదికకు భారత రాష్ట్రపతికి ఈ ఏడాది మార్చిలో అందించారు. దీనికి కేంద్ర మంత్రివర్గం ఈ సెప్టెంబరులోనే గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో జమిలి బిల్లు ప్రవేశపెట్టడంలో భాగంగానే కేబినెట్ ఆమోదం తెలిపింది.