రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయలేమని సీబీఐ చేతులెత్తేసింది. వనరులు కొరత కారణంగా కేసు దర్యాప్తు తమ వల్ల కాదని సీబీఐ హైకోర్టుకు నివేదించింది. కర్నూలు శివారులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి 2017 ఆగస్టు 19 తేదీన అనుమానాస్పద స్థితి మృతిచెందింది.
తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్ యజమాని కొడుకులు లైంగిక దాడి చేసి చంపేశారని ప్రీతి తల్లిదండ్రులు సుగాలి రాజు నాయక్, పార్వతిదేవి న్యాయపోరాటానికి దిగారు. స్కూల్ కరస్పాండెంట్, ఆయన కుమారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది రోజులకే వారు బెయిల్పై బయటకు వచ్చేశారు. దీంతో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం కేసును నామమాత్రంగా విచారణ జరిపించిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజలంతా టీడీపీ సర్కార్పై మండిపడ్డారు.
పవన్ ప్రామీస్ చేసినా..
సుగాలి ప్రీతి కేసుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. బహిరంగ సభల్లో సుగాలి ప్రీతి కేసును పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ప్రీతి తల్లిదండ్రులు సైతం పవన్ను కలిశారు. తప్పకుండా న్యాయం చేస్తానని పవన్ వారికి ప్రామీస్ సైతం చేశారు. పబ్లిక్ మీటింగ్స్లోకి ప్రీతి తల్లిదండ్రులను తీసుకువచ్చి వారికి న్యాయం చేస్తానని మాటిచ్చారు. కానీ, కూటమిలో నేడు పవన్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండగానే ఆ కేసు నీరుగారిపోతోంది.

సీబీఐకి అప్పగించిన వైసీపీ ప్రభుత్వం
సుగాలి ప్రీతి కేసులో అనేక అనుమానాలను వ్యక్తమవుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులకు న్యాయం చేయాలని అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు. అదేవిధంగా 2021లో ప్రీతి తల్లిదండ్రులకు రూ. 8 లక్షల నగదుసాయంతో పాటు 5 సెంట్ల ఇంటి స్థలం, ఐదెకరాల పొలాన్ని కూడా జగన్ ప్రభుత్వం ఇచ్చింది. ప్రీతి తండ్రి రాజు నాయక్కు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చింది.

వనరులు లేవు..
మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో సుగాలి ప్రీతి కేసును సీబీఐ అధికారులు పక్కకు పడేశారనే తెలుస్తోంది. వనరులు కొరత కారణంగా తాము దర్యాప్తు చేయలేమని సీబీఐ హైకోర్టుకు నివేదించింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు పలు ముఖ్యమైన, సున్నిత కేసుల్లో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. కాబట్టి సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తూ వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన ఉత్తర్వులపై ప్రీతి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలని హైకోర్టును సీబీఐ కోరింది.