హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీతో పాటు గాయకుడు రాకీ మిట్టల్ (జై భగవాన్) పై గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది. ఢిల్లీలో నివసించే ఓ యువతి ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. తన స్నేహితురాలితో కలిసి హిమాచల్ ప్రదేశ్ వెళ్లినప్పుడు ఈ దారుణం జరిగిందని, 2023 జూలై 2న జరిగిన ఘటనపై బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
హిమాచల్ ప్రదేశ్లోని కసౌలీకి తన ఫ్రెండ్తో కలిసి టూర్కు వెళ్లానని, ఓ హోటల్లో బడోలీ, మిట్టల్ కలిశారని బాధిత యువతి తెలిపింది. తాను నటిగా ఎదగడానికి అవకాశం ఇస్తానని, త్వరలో తీయబోయే ఆల్బమ్లో అవకాశం ఇస్తానని మిట్టల్ హామీ ఇచ్చారని, బడోలీ తాను సీనియర్ రాజకీయ నాయకుడని, తనకు పెద్దస్థాయిలో పరిచయాలు ఉన్నాయని, ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తానని ప్రలోభపెట్టారని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం తనకు బలవంతంగా మద్యం తాగించారని, తన ఫ్రెండ్ను బెదిరించి పక్కకు తీసుకెళ్లారని ఆమె తెలిపింది. అనంతరం తనపై ఇద్దరు కలిసి లైంగికదాడికి పాల్పడ్డారని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని వివరించింది. తన నగ్న ఫొటోలు, వీడియోలు తీసుకున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.