కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోకు కఠిన సమయం ఎదురవుతోంది. నేషనల్ డెమొక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) నేత జగ్మీత్ సింగ్ ట్రూడో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో కెనడా రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఎన్డీపీ నేత విమర్శలు
జగ్మీత్ సింగ్ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విడుదల చేసిన లేఖలో ట్రూడోను తీవ్రంగా విమర్శించారు. “ట్రూడో ప్రజల కోసం కాకుండా, శక్తిమంతుల కోసం మాత్రమే పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రజల అవసరాలను విస్మరించిందని” ఆయన ఆరోపించారు. హౌస్ ఆఫ్ కామన్స్ (దిగువ సభ) వచ్చే సమావేశంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
ఉపప్రధాని రాజీనామా
ఇటీవలి కాలంలో ట్రూడో ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లు మరింత తీవ్రంగా మారాయి. ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రిలాండ్ ఆర్థికశాఖ మార్పుల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు. “ప్రధాని ప్రజాదరణ కోల్పోతున్నారనే కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాను” అని ఆమె వెల్లడించడం గమనార్హం.
ఎన్నికల ముందు ఉత్కంఠ
వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలకు ముందు, ట్రూడో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం దాఖలవడంతో రాజకీయ ఉత్కంఠ పెరిగింది. ఈ తీర్మానానికి అన్ని పార్టీల మద్దతు లభిస్తే, కెనడాలో తొమ్మిదేళ్ల ట్రూడో పాలన ముగిసే అవకాశాలు ఉన్నాయి.