ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం క్యాలెండర్ను ఆవిష్కరించిన అనంతరం కేటీఆర్ మట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యవహారం అహనా పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాసరావు క్యారెక్టర్లాగా ఉందని సెటైర్లు వేశారు.
ఢిల్లీ నుంచి టూరిస్టులను తీసుకొచ్చి హామీల కురిపించడం, బాండ్ పేపర్లతో అఫిడవిట్లను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు ఇచ్చిందని గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి గ్యారంటీ కార్డులు పంచారని, అధికారంలోకి వచ్చిన తర్వాత 420 రోజులు గడుస్తున్నప్పటికీ హామీల అమలులో విఫలమయ్యారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
రేవంత్ సర్కార్ ధోరణికి నిరసనగా జనవరి 30న మహాత్మా గాంధీని స్మరిస్తూ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ గాంధీకి వినతిపత్రాలు సమర్పిస్తామని వివరించారు. అడ్డిమారి గుడ్డి దెబ్బలో రేవంత్రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర చిన్నపాటి మంత్రసాని పాత్ర అని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి దమ్ముంటే రైతు భరోసా పథకాన్ని అమలు చేసి చూపించాలని, పెట్టుబడులు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తే సన్మానం చేస్తామని సవాలు విసిరారు.