తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించకపోవడమే కాకుండా, ఎవరికీ మద్దతు ఇవ్వకూడదని బీఆర్ఎస్ శ్రేణులకు కూడా స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లుగా సమాచారం.
ఈ నిర్ణయం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కేటీఆర్, హరీశ్ రావు సహా ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వగా, అధిష్టానం నిర్ణయం మేరకు బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికలకు దూరంగా ఉండనున్నారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను బీఆర్ఎస్ త్వరలో బహిరంగంగా వెల్లడిస్తుందా, లేదా రాజకీయ వ్యూహంలో భాగంగా ఇదే కొనసాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.