తెలంగాణలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. వారు తమ మెడలో మిర్చి దండలు వేసుకుని కౌన్సిల్ ఆవరణలో ఆందోళనకు దిగారు.
మిర్చి రైతులకు న్యాయం చేయాలని, క్వింటాల్కు రూ. 25,000 గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. గత సీజన్లో రాష్ట్రంలో 4 లక్షల ఎకరాల్లో సాగైన మిర్చి ఈసారి కేవలం 2.4 లక్షల ఎకరాలకు తగ్గిపోయిందని ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి, కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి నాఫెడ్, మార్క్ఫెడ్ ద్వారా మిర్చిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. అంతేకాదు, తెలంగాణ మిర్చిని విదేశాలకు ఎగుమతి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, మిర్చిని సుగంధ ద్రవ్యాల బోర్డులో కాకుండా ఆహార పంటల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.