తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. హుజూరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. క్వారీ యజమాని మనోజ్ రెడ్డిని బెదిరించి రూ. 50 లక్షలు డిమాండ్ చేశారనే ఆరోపణలపై ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. మనోజ్ రెడ్డి భార్య కట్టా ఉమాదేవి ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అరెస్ట్ అనంతరం కౌశిక్ రెడ్డిని వరంగల్కు తరలించి, ఎంజీఎం హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత శనివారం ఉదయం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఈ ఘటనకు సంబంధించి గతంలోనూ కౌశిక్ రెడ్డిపై ఇలాంటి ఆరోపణలు రాగా, ఏప్రిల్ 2025లో ఉమాదేవి ఫిర్యాదు చేసినప్పుడు తెలంగాణ హైకోర్టు ఆయన అరెస్టును ఏప్రిల్ 28 వరకు నిలిపివేసింది. ఆ ఫిర్యాదులో, 2023లో కౌశిక్ రెడ్డి రూ. 25 లక్షలు వసూలు చేశారని, మళ్లీ ఏప్రిల్ 18న రూ. 50 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. అయితే, కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది ఈ కేసు రాజకీయ కక్షతో నమోదైందని, మనోజ్ రెడ్డి అక్రమ క్వారీ వ్యాపారం నిర్వహిస్తున్నాడని, దానిని అడ్డుకోవడానికి ఎమ్మెల్యే ప్రయత్నించారని వాదించారు. ఈ కేసు జూన్ 17న హైకోర్టులో విచారణకు వచ్చినప్పుడు, జస్టిస్ కే. లక్ష్మణ్ కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన రద్దు పిటిషన్ను తిరస్కరించారు.
ఈ అరెస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తతను రేకెత్తించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అరెస్టును “అక్రమ, నిరంకుశ చర్య”గా ఖండిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. సోషల్ మీడియా వేదిక కౌశిక్రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఘటన రాజకీయ రంగంలో మరింత చర్చనీయాంశంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.