తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది. రాష్ట్రంలో 20 శాతం కమిషన్ల దందా నడుస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
కమిషన్ల రాజ్యమే..
జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రంలో గతంలో ఇలాంటి కమిషన్ల వ్యవస్థ వల్ల ప్రజలు ప్రభుత్వాన్ని మార్చారని గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఓకే పరిస్థితి నెలకొంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకే బిల్లులు విడుదల చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
రాష్ట్ర సచివాలయం నుంచే నేరుగా ఈ కమిషన్ల దందా నడుస్తోందని ఆయన ఆరోపించారు. కేవలం కాంట్రాక్టర్లకు మాత్రమే కాకుండా, ప్రజా సేవలకు సంబంధించిన నిధుల విడుదలలో కూడా ఈ 20 శాతం కమిషన్ వ్యవస్థ ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల పాలనలో ఎంత మొత్తం డబ్బులు కాంట్రాక్టర్లకు ఇచ్చారనే విషయంపై శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం మంత్రులుగా వ్యవహరిస్తున్న వారు కమిషన్ల దందాలను ఆపాలని, అందరికీ సక్రమంగా బిల్లులు విడుదల చేయాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై అధికార పక్షం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.







