అనంతపురం (Anantapuram) జిల్లాలో జరిగిన ఓ హృదయ విదారక ఘటన చిన్నారు తల్లిదండ్రులను కలచివేస్తోంది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల నాలుగేళ్ల చిన్నారి ప్రాణం కోల్పోయాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా యాడికి పట్టణంలోని చెన్నకేశవస్వామి (Chennakesava Swamy) కాలనీ (Colony)లో చోటుచేసుకుంది.
ఒక చిన్న పొరపాటు
స్థానికుల వివరాల ప్రకారం, రామస్వామి–చాముండేశ్వరి (Ramaswamy-Chamundeshwari) దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాలుగేళ్ల కుమారుడు రుత్విక్, రెండేళ్ల కుమార్తె యశస్విని. మూడు రోజుల క్రితం తల్లిదండ్రులు ఫ్లాస్క్లో ఉంచిన వేడి టీ (Hot Tea) ని మంచినీరు అని పొరపాటున భావించి రుత్విక్ (Ruthvik)కు ఇచ్చారు. క్షణాల్లోనే ప్రమాదం జరిగింది. టీ తీవ్రమైన వేడిగా ఉండటంతో రుత్విక్ గొంతు కాలిపోయింది.
ఆసుపత్రిలో చికిత్స ఫలించలేదు
తీవ్ర నొప్పితో బాధపడుతున్న చిన్నారిని తల్లిదండ్రులు వెంటనే తాడిపత్రి (Tadipatri) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పరిస్థితి విషమించడంతో అనంతపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, చిన్నారి రుత్విక్ ప్రాణాలను రక్షించలేకపోయారు. శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ రుత్విక్ కన్నుమూశాడు.
కన్నీళ్లలో మునిగిన కుటుంబం
ఈ ఘటనతో కుటుంబం తల్లడిల్లిపోయింది. తల్లి చాముండేశ్వరి ఆర్తనాదాలు చుట్టుపక్కల వారిని కూడా కదిలించాయి. రుత్విక్ చెల్లి యశస్విని కూడా అదే టీ తాగినప్పటికీ, ఆమెకు స్వల్ప గాయాలే అయ్యాయి. చిన్నారి మరణంతో చెన్నకేశవస్వామి కాలనీపై విషాదఛాయలు అలుముకున్నాయి.