”మీకో దండం.. మీ పార్టీకో దండం”.. బీజేపీకి రాజాసింగ్ గుడ్ బై

''మీకో దండం.. మీ పార్టీకో దండం''.. బీజేపీకి రాజాసింగ్ గుడ్ బై

తెలంగాణ బీజేపీ (Telangana BJP)కి గోషామహల్ (Goshamahal) ఎమ్మెల్యే టి. రాజాసింగ్ (T. Raja Singh) భారీ షాక్ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక వ్యవహారంలో అసంతృప్తితో ఆయన పార్టీ సభ్యత్వానికి (Party Membership) రాజీనామా (Resignation) చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి (G. Kishan Reddy)కి రాజీనామా లేఖ అందజేసిన రాజాసింగ్, పార్టీ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటన తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలను బ‌య‌ట‌పెట్టింది.

రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళితే తన మద్దతుదారులను బెదిరించారని ఆరోపించారు. “అధ్యక్షుడు ఎవరు కావాలనేది ముందే డిసైడ్ చేసిన తర్వాత ఎన్నిక ప్రక్రియను నాటకీయంగా చేపట్టారు. ఇది పారదర్శకత లేని ప్రక్రియ” అని ఆయన విమర్శించారు. పార్టీ కోసం తాను ఎంతో క‌ష్ట‌ప‌డ్డాన‌ని, అయినా త‌న‌ను పట్టించుకోలేదని, తన కుటుంబం టెర్రరిస్టు టార్గెట్‌లో ఉంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ గుర్తుపై గెలిచిన త‌న‌ ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు లేఖ రాయాలని కిషన్ రెడ్డిని కోరినట్లు రాజాసింగ్ తెలిపారు. “పార్టీలో కొందరు బ్రోకరిజం చేస్తున్నారు. నాకు అలాంటి రాజకీయం రాదు. పార్టీకి దండం, మీకు దండం” అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ రాజీనామా ప్రకటన తెలంగాణ బీజేపీలో సంచ‌ల‌నం సృష్టించింది. రాజాసింగ్ గతంలోనూ పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. పార్టీ అధిష్ఠానం ఈ రాజీనామాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే రాజాసింగ్ ఏ పార్టీలో చేరుతార‌నే చ‌ర్చ కూడా ఊపందుకోవ‌డం విశేషం.

Join WhatsApp

Join Now

Leave a Comment