బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణ బీజేపీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా రాజాసింగ్ మాటలను బట్టి స్పష్టంగా అర్థమవుతోంది.
తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీ సీఎంతో కొందరు బీజేపీ నేతలు రహస్యంగా సమావేశమవుతున్నారని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంతో రహస్య మంతనాలు జరుపుతున్న వారిని రిటైర్ చేస్తేనే తెలంగాణ బీజేపీకి మంచి రోజులు వస్తాయన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని పాత సామాను బయటకు పోవాలన్నారు. బీజేపీ అధిష్టానం దీనిపై దృష్టి పెట్టాలని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజాసింగ్ వ్యాఖ్యలతో బీజేపీలో కొందరు నేతలపై గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన పేర్కొన్న “పాత సామాను” వ్యాఖ్య పాత తరం నేతలపై వ్యతిరేకతను సూచిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు బీజేపీ నేతలను టార్గెట్ చేసి రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా స్పష్టమవుతోంది. మరి రాజాసింగ్ వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, తెలంగాణ బీజేపీలో ఏవైనా మార్పులు జరుగుతాయా అనేది వేచి చూడాలి.