ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లోని బీజాపూర్ జిల్లా (Bijapur District) నేషనల్ పార్క్ (National Park) అడవుల్లో యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ (Anti-Maoist Operation) కొనసాగుతోంది. జూన్ 5వ తేదీ నుంచి జరుగుతున్న ఈ ఆపరేషన్లో ఏడుగురు మావోయిస్టులు (Seven Maoists) మృతి చెందినట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర (Bijapur SP) కుమార్ యాదవ్ (Jitendra Kumar Yadav) వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు (Central Committee Member) సుధాకర్ అలియాస్ గౌతమ్ (Sudhakar Alias Gautam), తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ (Bhaskar), ఒక గుర్తు తెలియని మహిళా మావోయిస్ట్, నలుగురు ఇతర మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఉన్నారు. అయితే, ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి భద్రతా బలగాలు రెండు ఏకే-47 రైఫిళ్లతో సహా పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మావోయిస్ట్ సాహిత్యం, మందులు, రోజువారీ వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఎన్కౌంటర్ స్థలంలో (Encounter Site) సెర్చింగ్ ఆపరేషన్ (Searching Operation) కొనసాగుతోందని, రక్తపు మరకలు, లాగిన గుర్తుల ఆధారంగా మరికొందరు మావోయిస్టులు గాయపడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఆపరేషన్లో దాదాపు 10,000 మంది భద్రతా సిబ్బంది, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), మరియు కోబ్రా యూనిట్ సభ్యులు పాల్గొంటున్నారు.
ఈ ఆపరేషన్ సమయంలో భద్రతా బలగాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కొందరు జవాన్లు పాము కాటు, తేనెటీగల దాడుల కారణంగా అస్వస్థతకు గురయ్యారు, మరికొందరు డీహైడ్రేషన్ వల్ల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ సంఘటనలు జరిగినప్పటికీ, ఆపరేషన్ కొనసాగుతోందని, పూర్తి సమాచారాన్ని ఆపరేషన్ ముగిసిన తర్వాత వెల్లడిస్తామని బీజాపూర్ ఎస్పీ తెలిపారు. ఈ ఎన్కౌంటర్ 2025లో బస్తర్ ప్రాంతంలో జరిగిన అతిపెద్ద ఆపరేషన్లలో ఒకటిగా నిలిచింది, ఇది మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బగా పరిగణిస్తున్నారు.