ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జేడీయూ-బీజేపీ కూటమి తమ అధికారాన్ని మరికొన్నేళ్లు కొనసాగించాలనే ప్రయత్నాల్లో ఉంది. ఇదే సమయంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ఒక కీలక వ్యాఖ్య బిహార్ రాజకీయాల్లో ఉత్కంఠ రేపింది. “ఇండియా కూటమిలో తిరిగి చేరేందుకు నితీష్ కుమార్కు డోర్స్ ఓపెన్లోనే ఉన్నాయి” అని ఆయన ప్రకటించారు.
నితీష్ స్పందన..నవ్వులు, సందేహాలు
లాలూ వ్యాఖ్యలపై నితీష్ కుమార్ స్పందిస్తూ, “క్యా బోల్ రహే హై (ఏం చెప్తున్నారు?)” అని నవ్వుతూ స్పందించారు. రాజకీయ గమనాలు పునఃసమీక్షించుకోవడం నితీష్కు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆర్జేడీ, కాంగ్రెస్లతో మహాఘట్ బంధన్ ఏర్పాటుచేసిన ఆయన, కొంత కాలానికే తిరిగి ఎన్డీయేలో చేరారు.
ఆర్జేడీ విమర్శలు..
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఎన్డీయే ప్రభుత్వం బిహార్లో పడిపోతుందని, నితీష్ స్వతంత్రంగా పాలించలేరని ఆరోపించారు. మరోవైపు జేడీయూ నేత లాలన్ సింగ్ లాలూ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ, జేడీయూ-బీజేపీ కూటమి బలంగా ఉందని, ప్రజాస్వేచ్ఛా సంప్రదాయం ద్వారా ప్రజలు తమ మాట చెప్పగలరని పేర్కొన్నారు.