‘కూట‌మిలో ప‌వ‌న్‌కు విలువ లేదు’.. జ‌న‌సేన నేత‌ల ఆగ్ర‌హం

'కూట‌మిలో ప‌వ‌న్‌కు విలువ లేదు'.. జ‌న‌సేన నేత‌ల ఆగ్ర‌హం

మీటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కూట‌మి పార్టీల మ‌ధ్య వివాదాన్ని సృష్టించాయి. ఫ్లెక్సీల్లో ఫొటోల విష‌యంలో మొద‌లైన గొడ‌వ ర‌చ్చ‌కెక్కింది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు స‌హ‌క‌రించిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు కూట‌మిలో విలువ లేదంటూ జ‌న‌సేన పార్టీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. భీమిలి నియోజ‌క‌వ‌ర్గంలో కూట‌మి నేత‌ల మ‌ధ్య వివాదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

విశాఖ జిల్లా భీమిలిలో కూట‌మి పార్టీలు హౌసింగ్‌ స‌మావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. సమావేశ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫొటోలు లేకపోవడంపై జనసేన, బీజేపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై వాగ్వాదం చోటుచేసుకోవడంతో జనసేన నాయకులు సహా ఇతర నాయకులు కార్యక్రమ వేదిక నుంచి తిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటన కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపాన్ని స్పష్టంగా బ‌య‌ట‌పెట్టింది.

జనసేన నాయకుడు అప్పలరాజు ఆవేదన
జనసేన నాయకుడు అప్పలరాజు మాట్లాడుతూ.. “మాకు గౌరవం ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, కానీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు కూడా కూటమిలో గౌరవం ఇవ్వడం లేదు. భీమిలి నియోజకవర్గంలో ప్రతీ సమావేశంలో ఇదే తంతు జరుగుతోంది. ఏమని ప్రశ్నిస్తే, అధికారుల మీద తోసేస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు తమను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని అప్పలరాజు ఆరోపించారు. ఈ వివాదం జనసేన కార్యకర్తలలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫొటోలు ఫ్లెక్సీలలో లేకపోవడం వారిని మరింత కలవరపరిచింది.

వివాదం తర్వాత స్టిక్కర్ల ఏర్పాటు
వాగ్వాదం తీవ్రతరం కావడంతో జనసేన, బీజేపీ నాయకుల ఒత్తిడితో ఫ్లెక్సీలపై న‌రేంద్ర‌మోడీ, పవన్ కళ్యాణ్ ఫొటోల స్టిక్కర్లను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ, ఈ సంఘటన కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య ఉన్న అంతర్గత విభేదాల‌ను బయటపెట్టింది. కూట‌మి విజయంలో జనసేన కీలక పాత్ర పోషించినప్పటికీ, టీడీపీ నాయకులు జనసేనను పక్కనపెడుతున్నారని అప్పలరాజు ఆరోపించారు. ఈ వివాదం కూటమి భవిష్యత్తులో సమన్వయంతో ముందుకు సాగడానికి సవాళ్లను సూచిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment