భారత్–రష్యా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అనేక కీలక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. ఆహార భద్రత, ఆరోగ్యం, లేబర్ మైగ్రేషన్ మొబిలిటీ, పోర్టులు, నౌకాయానం, పారిశ్రామిక అభివృద్ధి వంటి విభాగాల్లో పరస్పర సహకారం పెంచేందుకు ఇరు దేశాలు ముందుకు వచ్చాయి. 2030 వరకూ అనుసరించబోయే ఆర్థిక సహకార రోడ్మ్యాప్పై ఇరు దేశాలు అంగీకరించాయి.
సమావేశం అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “రష్యా మనకు ఎప్పటి నుంచో మిత్రదేశం. భారత్ వాణిజ్యం, అభివృద్ధికి రష్యా ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని అన్నారు. భారత్–రష్యా ఆర్థిక సంబంధాలు కొత్త శిఖరాలను అధిరోహిస్తాయని, ఇరు దేశాలకూ కలిసి పని చేసే విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆయన న్నారు. 2030 వరకూ ఆర్థిక సహకారం, పెట్టుబడులు, జాయింట్ ప్రాజెక్టులపై స్పష్టమైన అజెండాను రూపొందించినట్లు తెలిపారు.
భారత్కు పుతిన్ సంపూర్ణ మద్దతు
ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి రష్యా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మోడీతో చర్చలు చాలా ఫలప్రదంగా జరిగాయని, చమురు, గ్యాస్, బొగ్గు రంగాల్లో భారత్ అవసరాలను తీర్చేందుకు రష్యా సిద్ధంగా ఉందని చెప్పారు. భారత్–రష్యా మధ్య స్వేచ్ఛా వాణిజ్య మండలి ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పుతిన్ వెల్లడించారు. “భారత్తో ప్రస్తుతం 64 బిలియన్ డాలర్ల వాణిజ్యం ఉంది. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ట్రేడ్ లక్ష్యాన్ని చేరుకుంటాం” అని అన్నారు.
కుడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టు, వైద్య–ఆరోగ్య రంగాలు, టెక్నాలజీ అభివృద్ధి, రక్షణ రంగాల్లో సహకారాన్ని విస్తరించే అంశాలపై కూడా రెండు దేశాలు చర్చించాయి. వచ్చే ఏడాది భారత్ అధ్యక్షతన జరగనున్న బ్రిక్స్ సమావేశంపై ప్రత్యేక చర్చలు జరిగాయి. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశను చూపుతుందనే విశ్లేషణ వెలువడుతోంది.








