తెలంగాణలో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, టాలీవుడ్ ప్రముఖులపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ఇప్పుడు స్టార్ హీరోలపై కూడా ఫిర్యాదులు నమోదవ్వడం చర్చనీయాంశమైంది. బెట్టింగ్ కారణంగా పలు జిల్లాల్లో యువత ఆత్మహత్యలు చేసుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.
ఈ పరిణామాల మధ్య, టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, గోపీచంద్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్లపై తాజాగా పోలీసులకు ఫిర్యాదు అందింది. సైబర్ క్రైమ్ పోలీసులకు రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా, ఈ స్టార్ హీరోలు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వల్ల అనేక మంది భారీ మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నారని, ఈ నిధులు మ్యూల్ ఖాతాల ద్వారా చైనాకు చేరాయని ఆరోపించారు.
ఇప్పటికే పలువురు ప్రముఖులపై దర్యాప్తు కొనసాగుతుండగా, ప్రభాస్, బాలకృష్ణ, గోపీచంద్లపై ఫిర్యాదుతో కేసు మరింత వేడెక్కింది. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.