రాంగ్ రూట్లో కారు నడిపినందుకే కాకుండా, ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా వ్యవహరించినందుకు సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో నివసించే బెల్లంకొండ శ్రీనివాస్, మంగళవారం మధ్యాహ్నం తన కారులో జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 నుంచి జర్నలిస్ట్ కాలనీ వైపు వస్తూ, చౌరస్తాలో రాంగ్ రూట్లో ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ అతడిని అడ్డుకున్నాడు. దీంతో శ్రీనివాస్ కానిస్టేబుల్తో అమర్యాదగా మాట్లాడడమే కాక, అతడిపైకి కారును దూసుకెళ్లేందుకు యత్నించాడు. కానిస్టేబుల్ భయంతో పక్కకు జరగడంతో ప్రమాదం తప్పింది.
ఈ ఘటనను ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ మద్యం సేవించి వాహనం నడిపాడా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు శ్రీనివాస్ను స్టేషన్కు పిలిపించి విచారించనున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.