భారీ వర్షాలు (Heavy Rains) రెండు తెలుగు రాష్ట్రాలను (Telugu States) ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులన్నీ పొంగిపొర్లుతున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా వాతావరణ శాఖ (Weather Department) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి మరో పిడుగులాంటి వార్త చెప్పింది. బంగాళాఖాతం (Bay of Bengal)లో కొనసాగుతున్న అల్పపీడనం (Low Pressure) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో విస్తృత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ వర్షపాతం ప్రభావం రాష్ట్రంపై మరికొన్ని నాలుగైదు రోజులు కొనసాగనుంది.
తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది. విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయబడింది. అల్పపీడనం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా తీరాల మధ్య కొనసాగుతుండగా, దీనికి అనుబంధంగా 7.6 మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ తెలిపారు.