బాసరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా హైదరాబాద్లోని బేగం బజార్కు చెందినవారని అధికారులు గుర్తించారు. అమ్మవారి దర్శనం కోసం బాసరకు వచ్చిన వీరు, ఇంతలోనే ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు.
ప్రమాద వివరాలు
రాజస్థాన్కు చెందిన మూడు కుటుంబాలు హైదరాబాద్లోని బేగంబజార్లో నివాసముంటున్నాయి. దాదాపు 18 మంది సభ్యులు బాసరలోని సరస్వతీ అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేస్తుండగా, ఐదుగురు యువకులు గల్లంతయ్యారు.
పోలీసుల వివరాల ప్రకారం, నదిలో ఏర్పడిన ఇసుక దిబ్బల వద్దకు చేరుకుని స్నానాలు చేస్తుండగా, లోతైన ప్రాంతంలోకి వెళ్లి మునిగిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో రాకేష్ (17), వినోద్ (18), రుతిక్, మదన్ (18) ఉన్నారు. మరో యువకుడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.
సహాయక చర్యలు
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గజ ఈతగాళ్ల సహాయంతో నాలుగు మృతదేహాలను వెలికితీశారు. గోదావరి మొదటి ఘాట్ నుంచి అంబులెన్స్లో మృతదేహాలను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా ఒకరి ఆచూకీ లభ్యం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 18 మంది విహార యాత్రగా వచ్చి, నిమిషాల వ్యవధిలోనే ఈ ఘోరం జరిగిందని వారు పేర్కొంటున్నారు.