బంగ్లాదేశ్లో ప్రస్తుతం రాజకీయ ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలో, తాత్కాలిక ప్రభుత్వ అధ్యక్షుడు మహ్మద్ యూనస్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారికే ఓటు హక్కు కల్పించే ప్రస్తుత నియమాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 17 సంవత్సరాల వయస్సు కలిగినవారికి కూడా ఓటు హక్కు ఇవ్వాలని ఎన్నికల సంఘానికి సిఫారసు చేశారు. ఈ నిర్ణయం ఆమోదం పొందితే, బంగ్లాదేశ్లో 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సున్న మైనర్లకు కూడా ఓటు హక్కు లభించనుంది.
ఈ సిఫారసుపై పలు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (BNP) దీనిని వ్యతిరేకించింది. పార్టీ ప్రకటన ప్రకారం, 17 ఏళ్ల వయస్సు నుండి ఓటు హక్కు అందించడం వల్ల ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుందని, ఈ నిర్ణయంతో ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
బీఎన్పీ జనరల్ సెక్రటరీ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్, ఓటింగ్ వయస్సు 17కి తగ్గించడం వల్ల కొత్త ఓటరు జాబితాను తయారు చేయాల్సి వస్తుందని, దాంతో ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుందని తెలిపారు. ఈ నిర్ణయం మరోసారి ప్రజల్లో అనవసరమైన సమస్యను సృష్టిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎన్నికల కమిషన్తో చర్చ అవసరం
బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఓటు వేసేందుకు కనీస వయస్సు 18 ఏళ్లు. 17 ఏళ్లకు తగ్గించాలని ప్రతిపాదించడం ముందు, ఎన్నికల కమిషన్తో ఈ అంశంపై చర్చ జరగాల్సింది అని ఆలంగీర్ పేర్కొన్నారు. ఈ చర్చలు లేకుండా, నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని అభిప్రాయపడుతున్నారు.