కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వేడి రగిలించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్నారు.
బీసీ (BC) కులగణనను తప్పులతడకగా సాగించారని బండి సంజయ్ విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్లు అని చెబుతున్న కాంగ్రెస్ సర్కార్, 32 శాతం మాత్రమే అమలు చేయడానికి కుట్ర చేస్తున్నట్లు ఆరోపించారు. బీసీ కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని, ముస్లింలను బీసీల్లో కలిపే ప్రయత్నాన్ని మాత్రం ఒప్పుకోబోమని స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను టచ్ చేయడానికి ప్రస్తుత ప్రభుత్వానికి ధైర్యం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఢిల్లీలోని హస్తం పార్టీ పెద్దలకు ముడుపులు వెళ్లినందుకే ఈ కేసును కాంగ్రెస్ సర్కార్ మూలన పడేసిందని విమర్శించారు.