ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APFDC) ఛైర్మన్ పదవి చుట్టూ కొత్త రాజకీయ సస్పెన్స్ నెలకొంది. ఈ పదవి కోసం హరిహర వీరమల్లు (Harihara Veeramallu) నిర్మాత ఎ.ఎం. రత్నం (A.M.Ratnam) పేరును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రతిపాదించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వంలో పవన్ మాటకు తిరుగు లేదనే అభిప్రాయం ఏర్పడిన దశలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఏపీ ఎఫ్డీసీ(AP FDC) చైర్మన్ పదవి కోసం బాలయ్య మరో పేరును సిఫారసు చేసినట్లు సమాచారం.
బాలయ్య సూచించిన వ్యక్తి కూడా సమర్థుడే అని చెప్పుకుంటుండగా, పవన్ ప్రతిపాదనకు చెక్ పెట్టేందుకు అంతకంటే బలమైన పేరును ముందుకు తెచ్చినట్లుగా కూటమిలో చర్చ మొదలైంది. దీంతో తుది నిర్ణయం కూటమి పార్టీల మధ్య చిచ్చు రేపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎవరిని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా ఖరారు చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇక నిర్మాత ఎ.ఎం. రత్నం విషయానికొస్తే, పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆయన ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వార్తలు వచ్చాయి. సినిమా కోసం జనసేన పార్టీ ఏకమై ప్రాచారం చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. ఈ క్రమంలో రత్నంకి ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పదవి ఇస్తామన్న పవన్ హామీ కూడా ఇప్పుడు సందిగ్ధంలో పడింది. చివరికి ఈ పదవి ఎవరి ఖాతాలోకి వెళుతుందన్నది పరిశ్రమ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.







