పోలీసులకే రక్షణ లేకపోతే, సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? తాజాగా విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న దారుణ ఘటనతో ఈ ప్రశ్న తలెత్తింది. జాతర వేడుకల్లో అధికార పార్టీకి చెందిన కొందరు యువకులు తీవ్ర హంగామా సృష్టించి, విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐపై దాడి చేయడం కలకలం రేపింది.
విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి శ్రీవేణుగోపాల స్వామి తీర్థ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘డాన్స్ బేబీ డాన్స్’ కార్యక్రమంలో కొందరు యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. వేదికపై నృత్యం చేస్తున్న యువతులతో అసభ్యంగా ప్రవర్తించడంతో, విధుల్లో ఉన్న వల్లంపూడి ఎస్ఐ బి.దేవి వారు చేసే అసభ్య ప్రవర్తనను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.
అయితే, యువకులు మరింత రెచ్చిపోయి మహిళా ఎస్ఐపై దాడి చేశారు. ఆమె జుట్టు పట్టుకొని కొట్టి, దుర్భాషలాడారు. ప్రాణభయంతో ఎస్ఐ సమీపంలోని ఓ ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నా, అక్కడకీ వెళ్లి వేధింపులు కొనసాగించారు. ఈ ఘటనపై ఎస్ఐ దేవి, సీఐకి ఫిర్యాదు చేయడంతో రూరల్ ఎస్సై అప్పలనాయుడు, ఎల్ కోట, కొత్తవలస పోలీస్ స్టేషన్ ఎస్ఐలతో పాటు 30 మంది పోలీసులు గ్రామానికి చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ దాడిలో గాయపడిన ఎస్ఐ దేవిని ఆసుపత్రికి తరలించారు. గుడివాడ మోహన్, అతని స్నేహితులు గుడివాడ సంతోష్కుమార్, విష్ణుదుర్గ, హర్ష, ఎర్నిబాబు, గౌరినాయుడు తనపై దాడి చేశారని, దుర్భాషలాడారని, విధుల్లో ఆటంకం కలిగించారని ఎస్ఐ దేవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.








